Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 4 వ. భాగము

సాయి.బా.ని.స. డైరీ 4 వ. భాగము 03.03.1993 బుధవారము శ్రీ సాయి దత్తాత్రేయుని అవతారము అని శ్రీ సాయి సత్ చరిత్రలో హేమాద్రిపంతు ఉపోద్ఘాతములో చక్కగా వివరించినారు. అయినా నా మనసులో ఎక్కడో ఒక మూల ఫకీరు అనే భావన నిలిచిపోయింది. ఈ భావనను తొలగించటానికి నిన్నరాత్రి శ్రీ సాయి చూపించిన దృశ్యము నాలోని భావాలను మార్చి వేసినది. నేను పని చేస్తున్న అతుకు లేని తుప్పు పట్టని (స్టైన్ లెస్ స్టీలు) గొట్టాల తయారీ కర్మాగారాన్ని చూపించినారు. మా ఫ్యాక్టరీకి లారీలలో స్టైన్ లెస్ స్టీలు మూల పదార్థముగా యున్న ఉక్కు దిమ్మలు వస్తున్నాయి. అవి అన్నీ ఆఖరికి ఉక్కుగొట్టాలగా మారి పోయి తిరిగి లారీలలో ఫ్యాక్టరీనుండి బయటకు వెళ్ళిపోతున్నాయి. యింకొక దృశ్యములో బంగారు దిమ్మలు వస్తున్నాయి అవి ఆభరణాలుగా మారిపోతున్నాయి. ఒక ఆభరణానికి పాదరసము పూయబడినది. ఆ ఆ ఆభరణము బంగారపు రంగును కోల్పోయి తెల్లని రంగులో మెరుస్తున్నది. కొందరు దానిని బంగారు ఆభరరణము అంటున్నారు. మరికొందరు అది సత్తు ఆభరణము అని అంటున్నారు. కాని కంసాలివాడు వచ్చి అది సత్తు ఆభరణము కాదు అది బంగారు ఆభరణము అన్నారు. నాకు మెలుకువ వచ్చినది ఈ దృశ్యముతో నేను పొందిన అనుభూతి ఏమిటి ఒక్కసారి ఆలోచించినాను. నా దృష్ఠిలో శ్రీ సాయి బంగారు ఆభరణము, ఫకీరు అవతారము అంటే బంగారు ఆభరణానికి పాదరసము పూయటము నాదృష్టిలో. ఆ కంసాలి హేమాద్రిపంతు. మనము అందరము సాయి అవతారాన్ని (దత్తాత్త్రేయ అవతారాన్ని) హేమాద్రిపంతు గుర్తించిన విధముగా గుర్తించాలి. 05.03.1993 శుక్రవారము నిన్నటి రాత్రి శ్రీ సాయి చక్కని దృశ్యాన్ని ప్రసాదించినారు. ఆదృశ్యములో ఒక ముసలివాడు తిరగలిలో గోధుమలు పిండిగా విసరుతున్నాడు. అతనికి తినటానికి కావలసినదాని కంటే కొంచము ఎక్కువ గోధుమ పిండిని విసరినాడు. ఆయన నన్ను ఉద్దేశించి అన్నారు, "నీవు సంఘము అనే తిరగలిలో గోధుమలులాగ విసరబడి - పిండిగా మారి నా భక్తులకు రొట్టెగా మారాలి". ఒక్కసారి ఉలిక్కిపడి లేచినాను. ఆ మాటలు చెవిలో యింకా వినిపించుతున్నాయి. శ్రీ సాయి సత్ చరిత్రలో 1 వ. అధ్యాయములో గోధుమలు విసరుట దాని వేదాంత భావమును చక్కగా వివరించబడినది. శ్రీ సాయి నిన్నరాత్రి కలలో స్వయముగా గోధుమలు విసరుటలోని వేదాంత భావమును స్వయముగా నాకు వివరించినారు అని నా నమ్మకము. 06.03.1993 శనివారము నిన్న రాత్రి శ్రీ సాయి నా జీవిత పరిస్థితి చక్కగా కలలో దృశ్య రూపములో చూపించినారు. నేను రిక్షా తొక్కుతున్నాను. నా రిక్షాలో నా భార్య పిల్లలు కూర్చుని యున్నారు. వాన విపరీతముగా పడుతున్నది. రోడ్డుమీద గోతులు అన్నీ నీళ్ళతో నిండిపోయి రోడ్డు సరిగా కనిపించటములేదు. నేను రిక్షాను అతి కష్టము మీద త్రొక్కుతున్నాను. పిల్లలకు చికాకు వేసి వాళ్ళు రిక్షా దిగి వెళ్ళిపోయినారు. నా భార్య నన్ను జాగ్రత్తగా రిక్షా త్రొక్కమని వెనుకనుండి సలహాలు యిస్తున్నది. నాలో నీరసము వస్తున్నది. నా రిక్షా వెనుక ఒక రిక్షాను మా ఫ్యాక్టరీలో పని చేస్తున్న శ్రీ బాష అనే కార్మికుడు త్రొక్కుతున్నాడు. అతడు నా పరిస్థితిని చూసి నాపై ప్రేమతో నా రిక్షాను వెనుకనుండి త్రోస్తూ గతుకులు లేని రోడ్డు మీదకు నన్ను నాభార్యను - నా రిక్షాను చేర్చినాడు. నిన్నటి రాత్రి కలను అర్థము చేసుకొన్నాను. శ్రీ సాయి సత్ చరిత్ర 6 వ. అధ్యాయములో "సద్గురుని సహాయము తో ముండ్లను గోతులను తప్పించుకొని నడచినచో మనము మన గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును". ఈ విషయాన్ని దృశ్యరూపములో శ్రీ సాయి నాకు తెలియ చేసినారని గట్టిగా నమ్ముతాను. సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు (ఇంకా ఉంది)

No comments:

Post a Comment