Saturday 23 February 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 3

 23.02.2013
శనివారము  

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 3 

మూడవ అధ్యాయము

హైదరాబాద్                                                                                                                                                                                                                                                    08.01.1992
ప్రియమైన చక్రపాణి,

ఈ రోజు శ్రీ సాయి సత్ చరిత్రలోని మూడవ అధ్యాయములోని విషయాలు నీతో ముచ్చటించుతాను.  శ్రీసాయి అంటారు, నా మాటలయందు విశ్వాసముంచుము.  నాలీలలు వ్రాసినచో అవిద్య నిష్రమించిపోవును.  


 

వానిని శ్రధ్ధాభక్తులతో నెవరు వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించును.  బలమైన భక్తి ప్రేమ కెరటములు లేచును.  ఎవరయితే నాలీలలో  మునిగెదరో వారికి జ్ఞాన రత్నములు లభించును".  శ్రీసాయి చెప్పిన ఈమాటలను నేను నూరుపాళ్ళు నమ్ముతాను. జ్ఞాన రత్నాలు పొందటానికి ఆఖరి శ్వాస వరకు ప్రయత్నాలు చేస్తాను.  శ్రీహేమాద్రిపంతు అంటారు, భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును (25వ.పేజీ).  నన్నీ సత్ చ్చరిత్ర వ్రాయమని నియమించిరి (26వ.పేజీ).  శ్రీసాయి నాచేత ఈ ఉత్తరాలు నీకు వ్రాయించుతున్నారు అని భావించుతాను.  సముద్రములో ప్రయాణము చేయువారికి దీప స్థంభము 
                    
ఎంత అవసరమో అదే విధముగా జీవిత ప్రయాణములో శ్రీసాయి కధలు అనే దీపము వెలుగు చాలా అవసరము.  శ్రీసాయి తన భక్తులను తన స్వంత పిల్లలవలె చూసుకొన్నారు.  శ్రీ హేమాద్రిపంతు 1916 సంవత్సరములో సర్కారు ఉద్యోగము విరమించిన తర్వాత శ్రీసాయి స్వయముగా ఆయన ఆలన పాలన చూసుకొన్నారు.  నేను సర్కారు ఉద్యోగము విరమణ చేసిన తర్వాత సంతోషముగా శ్రీసాయి సేవకు అంకితమైపోయి ఆనాడు హేమాద్రిపంతు పొందిన భాగ్యాన్ని నీకు ప్రసాదించమని ఆసాయినాధుని వేడుకొంటున్నాను.

రోహిల్లా కధ ద్వారా శ్రీసాయి మనకు యిచ్చిన సందేశము ఏమిటి అని ఒక్కసారి ఆలోచించు - "ప్రతి మనిషి దైవ ప్రార్ధనలు నిత్యము చేయాలి.  కాని ఆప్రార్ధనలో గయ్యాళితనము యుండరాదు.  దైవ ప్రార్ధనలో ప్రశాంతత 

 యుండాలి".

            
శ్రీసాయి తన భక్తులకు యిచ్చిన ఉపదేశములోని ముఖ్య విషయము "మీరెక్కడ నున్నప్పటికి నేమి చేసినప్పటికి నాకు తెలియునని బాగుగా జ్ఞాపకము యుంచుకొనుడు. "ఈ ఒక్క మాట చాలును శ్రీసాయిని నమ్ముకొని బ్రతకటానికి.  ఈ మూడవ అధ్యాయము ముగింపులో బ్రతకటములో మంచి పధ్ధతిని చూపించినారు శ్రీసాయి.  వారు తమ భక్తులను బధ్ధకము, నిద్ర, చంచల మనస్సు, శరీరముపై విపరీతమైన అభిమానము విడిచి తమ యావత్ దృష్టిని తనపైనే ఉంచమన్నారు.  శ్రీహేమాద్రిపంతు ఈ అధ్యాయములో అన్న ఆఖరిమాట.  "బాబాను కూడా నెల్లవారు తమ హృదయములందు స్థాపించుకొదురు గాక" - నీవు నేను కూడా శ్రీసాయిని మన హృదయాలలో స్థాపించుకొందాము.

సాయి సేవలో

నీతండ్రి.  

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment