Sunday 4 August 2013

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి - 47వ.అధ్యాయం


    
     

04.08.2013 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

పుణ్యభూమి శిరిడీలో దొరికిన రత్నమణి సాయి -  47వ.అధ్యాయం

                                
                                                     18.02.92

ప్రియమైన చక్రపాణి, 

ఈ అధ్యాయములో శ్రీసాయి తన భక్తులకు గత జన్మ బంధాలు గురించి తెలియచేసే విషయాలు చెప్పినారు.  ఈ అధ్యాయము చదివిన తర్వాత నాలో చాలా మార్పులు చోటు చేసుకొన్నాయి.  అన్ని విషయాలు వివరముగా వ్రాయలేకపోయినా సంక్షిప్తముగా వ్రాస్తాను.  




ఈ ఉత్తరము చదివేముందు ఒక్కసారి 47వ. అధ్యాయము జాగ్రత్తగా చదువు.  వీర భద్రప్ప, చెన్న బసప్ప (పాము-కప్ప) కధ చదివిన తర్వాత, అది నాకధ అంటే నీ తండ్రి కధ అని నీకు అనిపించుతున్నది కదూ.  శ్రీసాయి సత్చరిత్రలో నీతిని గ్రహించు, "తనకెవరితోనైన శతృత్వమున్న యెడల దానినుండి విముక్తిని పొందవలెను.  ఎవరికైన ఏమైన బాకీ యున్న దానిని తీర్చి వేయవలెను.  ఋణముగాని, శతృత్వశేషముగాని, యున్నచో దానికి తగిన బాధ పడవలెను."  నాకధను సంక్షిప్తముగా చెబుతాను అని అన్నాను కదూ - విను- నేను 1970 సంవత్సరములో నీతల్లిని ప్రేమించి వివాహము చేసుకొన్నాను.  ప్రేమవివాహము నాపాలిట శాపముగా మారినది.  నీతల్లి యొక్క తండ్రి నన్ను చులకనగా చూడటము - నన్ను తరచుగా అవమాన పరచటము, తన దగ్గరయున్న ధనాన్ని నేను ఎక్కడ అడుగుతానో అనే భయముతో నన్ను ఎల్లప్పుడు దూరముగా యుంచేవారు.  

ఈ విధమైన ఆయన ప్రవర్తన నాలో శతృత్వము పెరగటానికి ఆస్కారము కలిగించింది.  1990 సంవత్సరము నాటికి మాయిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమని మండే స్థితి ఏర్పడినది.  1990 జూన్ నెలలో మొదటిసారిగ శ్రీసాయి సత్ చరిత్ర పారాయణ ప్రారంభించిన తర్వాత ఏవిధముగా ఈ శతృత్వము బాధను వదిలించుకోవాలి అనే ఆలోచనలు రాసాగినాయి.  నాజీవితములో అంటే ఈఉత్తరము వ్రాసేనాటికి నేను మీతాతగారి యింటిలో అంటే నామావగారి యింట పది పూటలు భోజనము చేసి యుండకపోవచ్చును.  మీఅమ్మ తండ్రి ఋణము ఎలాగ తీర్చుకొనేది.  ఆయనతో శతృత్వముతో యిన్నాళ్ళు గడిపినాను.  దానినుండి విముక్తి ఎప్పుడు పొందేది ఆసాయినాధునికే తెలుసు.  

శ్రీసాయి సేవలో 

నీతండ్రి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

No comments:

Post a Comment