Monday 4 August 2014

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 8వ.భాగం

    
         

04.08.2014 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. చెపుతున్న శ్రీసాయి సత్ చరిత్ర లోని అంతరార్ధాన్ని విందాము.
         

శ్రీసాయి సత్ చరిత్ర - తత్వం - అంతరార్ధం - 8వ.భాగం (ఆఖరి భాగం) 

ఇప్పుడు మనం బాబా అన్నమాటల అంతరార్ధాన్ని తెలుసుకుందాము.  దామూ తనకు సంతాన యోగం ఉన్నదీ లేనిదీ తెలుసుకోవడానికి జ్యోతిష్కులను సంప్రదించాడు.  అతనికి యిద్దరు భార్యలున్నాకూడా, సంతాన యోగం లేదని బాహాటంగానే జ్యోతిష్కులు చెప్పారు. 
      

సంతానం లేనివారెనెవరినయినా సంతాన ప్రాప్తిరస్తు అని దీవించడమంటే మరొకసారి త్వరలో మరోజన్మ పొందడమని అర్ధం. 




 ఆవిధంగా బాబా దామూకు ఒక్కక్షణం మరణాన్ని ప్రసాదించారు.  అనగా ప్రస్తుత జీవితంలో ఒక్కక్షణం విరామాన్ని సృష్టించారు.  ఆతరువాత మామిడిపండును అతని  చిన్న భార్యకు యిమ్మని చెప్పారు.  తరువాత ఆమె గర్భం ధరించి దామూకు ఒక కుమారుని కన్నది.       
               
శ్రీసాయి సత్ చరిత్ర 8వ.అధ్యాయాన్ని ఒకసారి గమనిద్ద్దాము.  బాబా, మహల్సాపతి, తాత్యా ముగ్గురూ ఉత్తరానికి, తూర్పుకి, పడమరకి తమ తలలను పెట్టి నిద్రించేవారు.  వారు దక్షిణంవైపు తలపెట్టుకొని ఎందుకని నిద్రించేవారు కాదు? 

భౌగోళికంగా, మానవుల కదలికలు, జీవనం, ఉత్తరం తూర్పు పశ్చిమం ఈ మూడు దిశలలోనే కేంద్రీకృతమయి ఉంటుంది.  కాని, దక్షిణదిశలో ఎంతో ఖనిజ సంపద ఉంది.  ఈ భౌతిక ప్రపంచంలో ప్రాపంచిక సుఖాలను కోరేవారి కోసం దక్షిణ దిక్కున తలపెట్టుకుని నిద్రించమనే చెప్పబడింది.  కాని, ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నవారికి దక్షిణ దిక్కు నిషేధం.  అందుచేతనే బాబా ఎప్పుడూ దక్షిణ దిక్కువైపు తలపెట్టి నిద్రించలేదు.  

8వ.అధ్యాయంలో బాబా తనగురువు తన తలను బోడిగుండు చేసి రెండు పైసలు దక్షిణ కోరారని చెప్పారు.  గుండుగీయించుకోవడమనగా లోపల ఉన్న అహంకారాన్ని తొలగించుకోవడమని అంతరార్ధం.  రెండుపైసల దక్షిణకు అర్ధం శ్రధ్ధ, సబూరి అప్పుడు గురువు ఎల్లప్పుడూ తన శిష్యుని వెంటే ఉంటానని చెప్పారు.  తిరుపతిలో శ్రీవేంకటేశ్వరస్వామికి తలనీలాలనర్పించడంలోని అంతరార్ధంకూడా యిదే.      
                   
సాయి ప్రత్యక్షంగా సూటిగా చెప్పిన మాటలను నేను మీమనసుకు హత్తుకునేటట్లు చెప్పదలచుకొన్నాను.  "ఈప్రపంచంలో నాభక్తులు కోరినవన్నీనేను ప్రసాదిస్తాను.  ఆఖరికి వారికి కోరుకోవడానికి కోరికలేవీ మిగలనపుడు నేను యివ్వాలనుకున్నది వారికి అనుగ్రహిస్తాను."

అందుచేత మనమందరమూ ఈప్రపంచంలో మన బాధ్యతలను నిర్వర్తించి బాబా మనకివ్వదలచుకొన్న ఆధ్యాత్మిక ధనాన్ని స్వంతం చేసుకొందాము.  

జై సాయిరాం.    

(సమాప్తం)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

(త్వరలో సాయి.బా.ని.స. వివరించే సాయి సందేశాలు)   

No comments:

Post a Comment