Monday 3 December 2012

జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 4వ.భాగము

                                                   


                                                    
02.12.2012 సోమవారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

ఈ రోజు సాయి.బా.ని.స. చెప్పుతున్న జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 4వ.భాగము విందాము. 


జన్మ, పునర్జన్మలపై సాయి ఆలోచనలు 4వ.భాగము 



ఈ విషయం మీద శాస్త్రవేత్తలు ఏమని చెప్పారో ఒక్కసారి దాని మీద దృష్టి పెడదాము. కొన్ని రకాలయిన జీవులు క్రమంగా అంతరించి పోవడం మనకు తెలుసు.  మరొక మాటలో చెప్పాలంటే బహుశా వాటి ఆత్మలు మానవ రూపాలను ధరిస్తూ ఉండటం, ఆ విధంగా మానవ జాతి అభివృధ్ధి చెందడం జరుగుతోంది.  జంతువులయొక్క మంచి లక్షణాలు, ప్రవర్తన వల్ల వాటిలోని ఆత్మలు మానవులుగా పునర్జన్మ ఎత్తుతున్నాయి. 



ఆత్మకు రూపం,రంగు, రుచి లేదు కనక దానిని చూడలేము. ఆత్మ శరీరములోనికి ప్రవేశించిన తరువాత చేసుకొన్న కర్మను బట్టి మంచి పనులుగాని, చెడు పనులు గాని చేస్తుంది. సాంకేతికంగా అభివృధ్ధి సాధించిన ఈ రోజుల్లో మనము గృహావసరాలకు, పరిశ్రమలకు ఎల్.పీ.జీ. వాడుతున్నాము. దానికి రంగు,రుచి,వాసన ఇటువంటివేమీ లేవు.  సులభంగా గుర్తించడానికి వీలుగా శాస్త్రవేత్తలు,  దానికి ఒక విధమైన వాసన కలిగిన గాస్ మెర్కప్టైన్ అనే  వాయువును కలిపారు.

అందుచేత భగవంతుడు ఆత్మ యొక్క శక్తిని మనం గ్రహించుకొనేందుకు వీలుగా వివిధ రకాలయిన జీవులలో ప్రవేశపెట్టే కార్యక్రమాన్ని చేపట్టాడు. మానవుల శరీరం గాని, జంతువుల శరీరం గాని మరణించిన తరువాత శిధిలమవుతాయి, ఇక ఆత్మలు క్రొత్త శరీరాలలోనికి అనగా మానవ శరీరంలోనికి గాని, జంతువులు లేక కీటకాల లోనికి ప్రవేశిస్తాయి. పురాణాల ప్రకారం ఈ విశ్వంలో  కోట్ల జీవరాసులు వున్నాయి.  మరొక విధంగా చెప్పాలంటే అవి ఒకదాని తరువాత మరొకటిగా తిరిగి జన్మలెత్తుతూ ఉంటాయి. 

మానవ రూపాలలో ఉన్నటువంటి ఆత్మ  నిరంతరం తమ జీవిత కాలమంతా అత్యుత్తమమైన లక్షణాలను ప్రదర్శించినట్లయితే ఆత్మ పరమాత్మలో లీనమయిపోతుంది. ఉదాహరణకి భారతంలోని ధృవుని చరిత్రను తీసుకొందాము. ఆయన తన రాజ్యాన్ని చక్కగా 26 వేల సంవత్సరాలు పరిపాలించాడు.  శ్రీ మహా విష్ణువుయొక్క అనుగ్రహంతో ధృవుడు ధృవతారగా ఆకాశంలో వెలుగొందుతున్నాడు. 
                                    


శ్రీ సాయి సత్ చరిత్రలోని 31వ. అధ్యాయములో మనకి ఇటువంటి పాత్ర కనపడుతుంది.  తాత్యా సాహెబ్ నూల్కర్ చనిపోయినప్పుడు, బాబా విచారంతో "తాత్యా మనని విడిచి వెళ్ళిపోయాడు.  అతనికి పునర్జన్మ లేదు" అన్నారు. ఈ విధంగా బాబా తన భక్తులు కొంతమందికి సద్గతిని కలిగించారు. 
                                        

శ్రీమద్భగవద్గీతలో 7 వ.అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగములోని 3, 30 శ్లోకాలలో ఏమి చెప్పబడిందో చూద్దాము.   

శ్రీకృష్ణ పరమాత్ములవారు ఇట్లా చెప్పారు: వేలల్లో ఒకరిద్దరు మాత్రమే నన్ను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చాలా అరుదుగా వారిలో ఒక్కడు మాత్రమే నా యదార్ధ రూపమును తెలుసుకొనుచున్నాడు. వారే తాము చేసే ప్రయత్నాల వల్ల  నన్ను, నా నిజ స్వరూపాన్ని తెలుసుకొని అంతులేని జనన మరణ చక్రాలనుంచి శాశ్వతంగా విముక్తులవుతున్నారు. 

శ్రీ సాయి సత్ చరిత్ర 31వ. అధ్యాయములో బాబా పునర్జన్మ గురించి ఏమని చెప్పారో తెలుసుకొందాము. బాబా దర్బారుకు జబ్బు పడిన పులిని తీసుకొనివచ్చారు.  బాబా "ఈ పులి కిందటి జన్మలో మానవునిగా మీకు ఋణపడి ఉంది.  పులిగా జన్మించి కిందటి జన్మలోని ఋణాన్ని తీర్చుకొని ఈ ద్వారకామాయిలో సద్గతి పొందింది" అన్నారు.


(ఇంకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు 


  బాబా లీలలకు ఈ బ్లాగు కూడా చూడండి.www.telugublogofshirdisai.blogspot.com

No comments:

Post a Comment