Sunday 14 September 2014

కలలలో శ్రీసాయి - 8వ.భాగం


14.09.2014 ఆదివారం
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్స్లు

ఈ రోజు సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు గారు చెబుతున్న కలలలో శ్రీసాయి వినండి

కలలలో శ్రీసాయి - 8వ.భాగం

ఆంగ్ల మూలం : సాయిబానిస శ్రీరావాడ గోపాలరావు

తెలుగు అనువాదం : ఆత్రేయపురపు త్యాగరాజు - 9440375411

మనం చేసే పూజలను బాబా స్వీకరిస్తారనటానికి ఆయన కలల ద్వారా తెలియపరుస్తూ ఉంటారు.  బాబా 1918 విజయదశమినాడు మహాసమాధి చెందారు.  మరునాటి ఉదయం బాబా లక్ష్మణ్ మామా కలలో దర్శనమిచ్చి తన పార్ధివ శరీరానికి హారతి యిమ్మని చెప్పి హారతిని స్వీకరించారు.   

1991వ.సంవత్సరం శ్రీరామనవమినాడు తెల్లవారుజామున బాబా నాస్వప్నంలో దర్శనమిచ్చి, ఈరోజున నీవు నాకు నాలుగు హారతులు యివ్వు.  నేను నీయింటికి రామలక్ష్మణుల రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరిస్తానని చెప్పారు.  బాబా చెప్పినట్లుగానే ఆరోజున బాబాకు నాలుగు హారతులు యిచ్చి, వచ్చిన భక్తులందరికీ ప్రసాదం పంచిపెట్టి, రాత్రి యిక నిద్రకు ఉపక్రమిస్తున్నాను.  ఆరోజున బాబా నాయింటికి రామలక్ష్మణుల రూపంలో వస్తానని స్వప్నంలో నాకు చెప్పిన ప్రకారం వచ్చారా లేదా? నేను, నాభార్య, ఆరోజున వచ్చిన వారిలో మరి రామలక్ష్మణులెవరని జరిగిన సంఘటలన్నీ తిరిగి గుర్తు చేసుకొంటున్నాము. అపుడు నాభార్య నాతో "మీస్నేహితుడు రఘురామన్ కుమార్తెలిద్దరూ వచ్చి ప్రసాదం తీసుకొని వెళ్ళారు. వారిద్దరూ కవల పిల్లలు.  బహుశ సాయి వారిద్దరి రూపంలో వచ్చి ప్రసాదం స్వీకరించి ఉంటారు" అని అంది.  మన సాంప్రదాయంలో కవలపిల్లలకు రామలక్ష్మణులని పేరు పెట్టడం సహజం.   బాబా ఆవిధంగా తాను మాట యిచ్చిన ప్రకారం రామలక్ష్మణులుగా ఆకవల పిల్లల రూపంలో రావడం నాదృష్టంగా భావించాను.   

తన భక్తులెవరయినా అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే బాబా వారికి కలలో కనిపించి వారెప్పుడు ఆరోగ్యం పొందుతారో సూచనలు చేసేవారు.  శ్రీసాయి సత్ చరిత్ర 33వ.అధ్యాయాన్ని ఒక్కసారి గమనిద్దాము.  బాబా మహాసమాధి చెందిన ఒక సంవత్సరం తరువాత జరిగిన సంఘటన. 

భక్త నారాయణరావు బాగా జబ్బుపడి బాధపడుతూ ఉన్నాడు.  అతను తనకెప్పుడు ఆరోగ్యం చేకూరుతుందని బాబాను ప్రార్ధించాడు.  బాబా అతని కలలో ఒక సొరంగం నుండి బయటకు వచ్చి "ఆందోళన చెందకు.  రేపటినుండి నీకు ఆరోగ్యం చేకూరుతుంది.  వారం రోజులలో నువ్వు తప్పక నడవగలవు" అన్నారు.  బాబా చెప్పినట్లుగానె నారాయణరావు వారం రోజులలో పూర్తి ఆరోగ్యవంతుడయాడు.     
 
మరణానికి చేరువగా ఉన్న రోజులలో బాబా నన్ను రక్షించారు.  ఆసంఘటనను నేను మీకిప్పుడు వివరిస్తాను.  1992లోనే బాబా నాకు హార్ట్ అటాక్ వస్తుందని ముందుగానే సూచించారు.  ఆయన సూచించినట్లుగానె 1996 ఏప్రిల్ నెల 21వ.తారీకునాడు ఉదయం 7.30 నిమిషాలకు నాకు గుండెపోటు వచ్చింది.   



వెంటనె సీ.డీ.ఆర్. ఆస్పత్రిలో చేరాను.  డాక్టర్స్ వెంటనె ప్రాధమికంగా మందులు యిచ్చి 1996 ఏప్రిల్ 29వ.తారీకున యాంజియోగ్రాం చేసి ట్రిపుల్ బైపాస్ సర్జరీ చేయాలని నిర్ణయించారు.  అదేరోజు సాయిని ప్రార్ధించి ఈగండాన్నుండి గట్టెక్కించమని వేడుకొన్నాను.  బాబా నాకలలో దర్శనమిచ్చి "భగవంతుని దయ మే నెల 15తరువాతే నీమీద ప్రసరిస్తుంది.  అంతవరకు ఓపిక పట్టు". అని చెప్పారు.  ఆవిధంగా 1996 మే నెల 17వ.తారీకు ఉదయం నాగుండెకు ట్రిపుల్ బైపాస్ సర్జరీ జరిగింది.  ఆపరేషన్ జరిగిన రెండురోజుల తరువాత శ్రీసాయి నాకలలో  దర్శనమిచ్చి "నీవు పది రోజులలో లేచి తిరుగుతావు భయపడకు" అని అభయమిచ్చారు.  
 
  

శ్రీసాయి సూచించిన విధంగానే 1996 మేనెల 29వ.తారీకు సాయంత్రం ఆస్పత్రినుండి విడుదల చేయబడ్డాను.  ఆరోజు సాయంత్రం బాబాకు హారతినివ్వగలిగాను.  ఈవిధంగా సాయి, నేను జీవన్మరణ సమస్యలను ఎదుర్కొంటున్న రోజులలో నాకు స్వప్న దర్శనాలనిస్తూ ధైర్యాన్నిస్తూ పునర్జన్మని ప్రసాదించారు.   ఇదంతా నాదృష్టంగా భావిస్తున్నాను.   

(ఇంకా ఉంది)
(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)  

No comments:

Post a Comment