Saturday 19 September 2020

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 23 వ.భాగమ్

 











20.09.2020  ఆదివారమ్

ఓమ్ సాయి శ్రీ సాయి జయజయ సాయి

సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

శ్రీ సాయి సాగరంనుండి వెలికి తీసిన ఆణి ముత్యాలు 23 .భాగమ్

-      సాయిదర్బార్, హైదరాబాద్

-      సాయిబానిస

-       సంకలనం మరియు కూర్పు శ్రీమతి రావాడ మధుగోపాల్

-       సమర్పణ ఆత్రేయపురపు త్యాగరాజు

52  శ్రీ సాయి సమాధి

04.04.2020  శనివారము

నేను 1918 లో నాశరీరాన్ని వదలివేసినాను.  నా పార్ధివ శరీరాన్ని బూటీవాడలోని భూగృహములో గొయ్యి తీసి పూడ్చిపెట్టినారు.  నా శరీరము మట్టిలో కలిసిపోయినది.  నా ఎముకలు ఇంకా 500 సంవత్సరాల వరకు శక్తి కలిగి యుంటుంది.  తర్వాత శక్తి రూపాంతరము చెందుతుంది. నా ఆత్మ నా సమాధి మందిరములో నా సమాధిపై టేకు చెక్కలతో నిర్మించిన పందిరిని, దానిపై చక్కగ నగిషి చెక్కిన వడ్రంగి వారిని తలుస్తూ ఉంటుంది.  వడ్రంగివారు నాపై ప్రేమతో నా సమాధిపైన నగిషి పందిరిని నిర్మించినారు.



1918 నుండి నేటివరకు బహుకొద్దిమంది భక్తులు నా సమాధి భూగృహములోని అందాల నగిషి చెక్కిన పందిరిని చూసినారు.  ప్రత్యేక పర్వదినాలలో షిరిడీ సంస్థానము వారు నా భూగృహంలోకి వచ్చి నా సమాధిపై నూతన జరీ శాలువాను కప్పుతారు.  ఇప్పటికి నేను నా సమాధిపై నగిషితో నిర్మించిన పందిరిని నిర్మించిన వడ్రంగివారి ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాను.  నీకు వచ్చే జన్మలో షిరిడీలో భూగృహములోని నా సమాధిని చూసే భాగ్యము కలిగించుతాను.

53  అకాల మరణాలు

05.04.2020  ఆదివారము

ప్రతిమనిషి నిండు నూరు సంవత్సరాలు జీవించాలి అని కోరుకుంటారు.  కాని వాని జీవితములో స్వయంకృతాపరాధముతో కష్టాలు కొని తెచ్చుకొని అకాల మృత్యువు పాలగుతున్నారు.

నీ మిత్రుడు శ్రీ పున్నయ్య తన 60 .సంవత్సరములో వివాహము చేసుకొని ఇద్దరు పిల్లలను కని వారిని సరిగా పెంచలేక ఆర్ధిక ఇబ్బందులతో తన 72.ఏట మరణించెను.  మరి ఇందులో తప్పు నీ మిత్రునిది కాదా ఆలోచించు?

ఇంక నీ నగరములో కొంతమంది ధనవంతులు ధనాశతో రసాయన కర్మాగారాలు స్థాపించి, కర్మాగారాలలో కార్మికులకు సరియైన రక్షణ కవచాలు ఇవ్వక వారిచేత వెట్టిచాకిరి చేయించుకొని వారి అకాల మృత్యువుకు కారణం అగుతున్నారు.  ఇది ధనవంతులు చేస్తున్న పాపము కాదా?

కొందరు అక్రమ మార్గములో ధనసంపాదన చేస్తూ, విలాసవంతమైన జీవితము గడుపుతూ బీదవారికి అసూయ కలుగజేస్తున్నారు.  బీదవారు అసూయతో ధనవంతులను హత్య చేస్తూ సమాజంలో అరాచకము కలిగించుతున్నారు.  ఇది గొప్పవారు, ధనవంతులు చేస్తున్న పాపము కాదా?

54  ఆఖరి ముత్యము

06.04.2020  సోమవారము

ఈరోజున ప్రపంచములో 55 వేలమంది కరోనా వ్యాధితో మరణించినారు అనే వార్త నీ మనసులో చాలా బాధను కలిగించుతున్నది.  నీవు 24 సంవత్సరాలనుండి గుండె జబ్బుతో బాధపడుతున్నావు.  నీవు వృధ్ధాప్యములో 74 సంవత్సరాలు పూర్తిచేసావు.  ఇంక నీవు నా తత్త్వ ప్రచారమునుండి దూరంగా యుండు.  నీవు నా తత్త్వ ప్రచారములో 30 సంవత్సరాలు పూర్తి చేసావు.  ఇంకా నీవు నా భక్తుల సేవ చేయాలి అనే తపన, కీర్తి ప్రతిష్టలు ఆశించవద్దు.  మరణానికి భయం వద్దు.  కాని కరోనాకు దూరంగా జీవించు.

నేను నీకు గంపెడు ముత్యాలు ఇచ్చాను.  నీవు ఈ రోజుకి 54 ముత్యాలను శుభ్రము చేసి నా భక్తులకు అందజేసావు.  ఈ పనిలో తృప్తిచెంది ఇక శేష జీవితమును నా నామస్మరణతోను, మానసిక పూజతోను పూర్తిచేసి నా పాదాల దగ్గర నీ ఆఖరి శ్వాస తీసుకో.  నేను నీకు తిరిగి ఉత్తమ జన్మను ప్రసాదించుతాను.  మరుజన్మలో నీవు షిరిడీకి వచ్చి నన్ను పలకరించు.  ఇంక సెలవు -  బాబా

55. చివరి మాట

09.04.2020  గురువారము

శ్రీషిరిడీ సాయి భక్తులకు నమస్కారములు.  గత 30 సంవత్సరాలనుండి మీ అందరి సేవలో తరించి బాబాగారి ఆశీర్వచనాలు పొందగలిగాను.  మీ అందరికి శ్రీ సాయితత్త్వాన్ని తెలియజేయాలనే తపనతో మరియు శ్రీ సాయి ఆశీర్వచనాలతో శ్రీ సాయి మందార మకరందాలు, శ్రీ సాయి పుష్పగిరి, శిఖరాలు – లోయలలో శ్రీసాయి,  ఆనాటి ఋషులు – నేటి షిరిడీ సాయి, మానవత్వము ఇంకా బ్రతికే ఉంది అనే పుస్తకాలు వ్రాసాను.  ఈ 5 పుస్తకాలను సాయి భక్తులు చదివి చాలా బాగున్నాయి అని అనేకమంది టెలిఫోన్ ద్వారా మరియు ఇ మెయిల్ ద్వారా తెలియజేసినారు.

ఈ రచనలు నాకు తృప్తిని ఇవ్వలేదు.  కారణం ఇవి అన్నీ నా స్వంత ఆలోచనలతో వ్రాసిన పుస్తకాలు.  శ్రీసాయి సత్ చరిత్రలో బాబాగారు స్వయంగా అన్న మాటలు “నా ధ్యాత్మిక ధనాగారము నిండుగా ఉంది.  అసలైన భక్తులు వచ్చి వాటిని బండ్లలో తీసుకొని వెళ్ళండి” అని కోరినా ఎవరూ రావటం లేదు.  ప్రతి భక్తుడు తన ప్రాపంచిక కోరికలు తీర్చుకోవడానికి నా దగ్గరకు వస్తున్నారు.  నేను వారి కోరికలను తీర్చుతున్నాను.  “ఇది నాకు తృప్తి ఇవ్వటములేదు”. నేను ఈ మాటలపై దృష్టిని పెట్టినాను (సాయిబానిస).  తన భక్తులకు ఏమి ఇవ్వదలచినారు అని ఆలోచించి ఆయనతో ప్రతిరోజు తెల్లవారుజామున మాట్లాడుతూ ఆధ్యాత్మిక విషయాలను అడిగి తెలుసుకొని శ్రీసాయితో ముఖాముఖి అనే పుస్తకము వ్రాసాను.

ఈ పుస్తకము నా జీవితాశయమును నెరవేర్చినది.  శ్రీసాయి భక్తులకు సంతోషమును,  ఆధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగపడినది.  నా శ్రమను బాబాగారు గుర్తించి “నాకు ఒక గంపనిండ శ్రీసాయి సాగరమునుండి వెలికితీసిన ఆణిముత్యాలు” ఇచ్చినారు.  ఆ ముత్యాలలో 54 ముత్యాలను నేను నాభార్య శ్రీమతి మధుగోపాల్ కలిసి హారముగా (పుస్తక రూపములో) తయారుచేసి మీ అందరికి అందజేయుచున్నాము.  ఈ పుస్తకములో నా స్వంత ఆలోచనలు లేవు.  బాబాగారు నాకు స్వయంగా చెప్పిన మాటలను శ్రీ సాయి సాగరమునుండి వెలికితీసిన ఆణిముత్యాలు అనే పుస్తకముగా రూపొందించినాము.  నాకు, నాభార్యకు తృప్తి ఇచ్చిన ఈ పుస్తకమును మీరు అందరు చదివి మమ్ములను ఆశీర్వదించగలరు.  ఈ జన్మ ధన్యమైనది.  తిరిగి మళ్ళీ జన్మలో మీ అందరి సేవలో కలుస్తాను.

సదా శ్రీ సాయి సేవలో…

తేదీ. 09.04.2020                            రావాడ గోపాలరావు

హైదరాబాద్

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)

No comments:

Post a Comment