Sunday 21 October 2012

రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము




                                                

21.10.2012 ఆదివారము
ఓం సాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు

రామాయణంలో శ్రీసాయి 9వ. భాగము 

మన హృదయాలను పరిపాలించేది భగవంతుని చరణకమలాలే అని రామాయణం ద్వారా మనకు అర్ధమవుతుంది. 

శ్రీరామచంద్రులవారు రాజ్యాన్ని త్యజించి అడవులకు వెళ్ళారు. ప్రీతిపాత్రుడయిన రాముని యొక్క వియోగాన్ని భరించలేక దశరధ మహారాజు స్వర్గస్తులయారు .

తాను లేని సమయంలో తల్లి మూర్ఖత్వం వల్ల ఇటువంటి విపరీత పరిణామాలన్ని జరిగడంతో భరతుడు చాలా దుఖించాడు. అరణ్యానికి వెళ్ళి రాములవారిని ఒప్పించి తిరిగి రాజ్యానికి తీసుకుని వచ్చి పరిపాలనా బాధ్యతలను రామునికి అప్పగిద్దామనుకున్నాడు. శ్రీరామచంద్రులవారు తనకు బదులుగా తన పాదుకలను అయోధ్యకు తీసుకొనివెళ్ళి సిం హాసనం మీద పెట్టి పరిపాలనా బాధ్యతలను నిర్వహించమని భరతుడిని ఒప్పించారు.  దీనివల్ల రామాయణంలో పాదుకలకు ఇవ్వబడిన ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. భరతుడు తన శిరస్సుపై పాదుకలను పెట్టుకొని అయోధ్యకు తీసుకొని వచ్చారు. అయోధ్యకు చేరిన తరువాత, పాదుకలను సిం హాసనం మీద పెట్టి భరతుడు శ్రీరాములవారి తరఫున పరిపాలనా బాధ్యతలను చేపట్టారు.

శ్రీ సాయి సత్ చరిత్ర 5వ. అధ్యాయములో మనకు ఇటువంటివే కనపడతాయి.  

బాబా షిరిడీలో ప్రవేశించిన దానికి అనుగుణంగా బాయి కృష్ణజీ, దీక్షిత్ లు బాబా పాదుకలను షిరిడీకి తీసుకొనివచ్చి వేప చెట్టుక్రింద ప్రతిష్టించారు. 

పాలరాతి పాదుకలను వారు ఉపాసనీ మహారాజుగారి చేత ప్రతిష్టించ దలచి ఆయనను ఆహ్వానించారు.  ఉపాసనీ మహరాజు పాదుకలను 1912 వ సంవత్సరములో  శ్రావణ పూర్ణిమ రోజున వేపచెట్టుక్రింద ప్రతిష్టించి దానికి "గురుస్థాన్" అని పేరు పెట్టారు. 


బాబా అక్కడకు వచ్చి "ఇవి భగవంతుని పాదుకలు" అన్నారు.  

బాబా ఎప్పుడూ వాటిని  తన పాదుకలు అని చెప్పుకోలేదు.  "ఈ భగవంతుని పాదుకలను పూజించండి. గురు శుక్రవారములలో ఈ పాదుకలకు అగరుబత్తీలను, సాంబ్రాణి ధూపం వేసినచో భగవంతుని అనుగ్రహమును పొందగలరు" అని బాబా చెప్పారు. దీనిని బట్టి  పాదుకలకు మనము ఎంతటి ప్రాముఖ్యాన్నివ్వాలో అటు రామాయణం ద్వారా, ఇటు సాయి సత్చరిత్ర ద్వారా గ్రహించగలము.     

శ్రీ సాయి సత్చరిత్ర 43, 44 అధ్యాయముల ద్వారా భాగవతము, రామ విజయముల యొక్క గొప్పతనము తెలుస్తుంది. సాయినాధుని మహాసమాధికి వాటికి సంబంధం ఉంది. సామాన్య మానవులు జీవిత ఆఖరి క్షణాలలొ భాగవతం వింటూ మోక్షాన్ని పొందగలరు. సాధు సత్పురుషులు తమ ఆఖరి క్షణాలలో మహా సమాధి అయేముందు రామవిజయాన్ని వింటారు. శ్రీరామచంద్రులవారి అవతార పరిసమాప్తి అయేముందే రామవిజయం యొక్క ప్రస్తావన వస్తుంది. శ్రీరాములవారికి మరణం లేదు. బాబా మహా సమాధి అయే సమయములో తన భక్తుడయిన వాఝే చేత రామ విజయాన్ని చదివించుకోవడానికి బహుశా ఇదే కారణమయి ఉంటుంది. ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది కాబట్టి శ్రీరాములవారు తన అవతారాన్ని ఎట్లా చాలించారో మనము తెలుసుకొందాము.         

శ్రీరాములవారు తన కుమారులయిన లవ కుశులకు పట్టాభిషేకం చేశారు. 



సీతామాత ఎన్నోకష్టాలను అనుభవించి ఇక తన పాత్రను ముగించుకుందామని నిశ్చయించుకొన్నది. తాను 
ఎక్కడినుంచయితే జన్మించిందో ఆపుడమి తల్లి ఒడిలోకే 
చేరుకొన్నది.
 
ఇక శ్రీరామచంద్ర్రలవారికి ఏమి మిగిలింది? లక్ష్మీదేవి అప్పటికే 
విష్ణులోకానికి వెళ్ళిపోయింది.  

ఆమె ప్రక్కన ఉండటానికి తను కూడా వెళ్ళాలి. అందరూ చూస్తుండగా, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శతృఘ్నుడు, నలుగురూ కూడా సరయూ నదిలోకి ప్రవేశించి అదృశ్యమయ్యారు. సరయూ నదిలోనించి, శంఖు చక్ర గదా ఆయుధాలను ధరించి ఆదిశేషునిపై పవ్వళించి శ్రీమహావిష్ణువు స్వర్గలోకానికి వెళ్ళారు. ఇదంతాకూడా రామాయణంలో వర్ణించబడి ఉంది.   

బాబా మహాసమాధి ఎలా చెందారన్న విషయం మనకు శ్రీ సాయి సత్చరిత్ర 43 - 44 అధ్యాయాలద్వారా తెలుస్తుంది. అక్టోబరు 15 వ. తేదీ 1918 సంవత్సరము విజయదశమి  మధ్యాహ్న్నము వేళ దశమి వెళ్ళి ఏకాదశి ఘడియలు సమీపిస్తున్న సమయములో  బాబా ద్వారకామాయిలో తన శరీరాన్ని త్యజించి విష్ణులోకానికేగారు.  రామాయణంలో శ్రీరామ చంద్రులవారు, శ్రీసాయి సత్చరిత్రలో బాబా ఇద్దరూ కూడా  విష్ణులోకానికి చేరుకొన్నారు.  

ఆనాటిశ్రీరాములవారే ఈనాటి  శ్రీ షిరిడీ సాయిరాములవారని తెలియచేస్తూ ఈ ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. 

రామాయణంలో శ్రీసాయి సమాప్తము

త్వరలో శ్రీకృష్ణ పరమాత్మగా శ్రీసాయి ....ఎదురు చూడండి

(సర్వం శ్రీసాయినాధార్పణమస్తు)


పాదుకల గురించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ ను చూడండి. 

http://telugublogofshirdisai.blogspot.in/

No comments:

Post a Comment