Thursday 29 March 2012

సాయి.బా.ని.స. డైరీ - 1995 (16)



29.03.2012 గురువారము

ఓంసాయి శ్రీసాయి జయజయ సాయి
సాయి బంధువులకు బాబావారి శుభాశీస్సులు
ఈ రోజు సాయి.బా.ని.స. డైరీ - 1995 16వ. భాగాన్ని చదువుకుందాము.

సాయి.బా.ని.. డైరీ - 1995 (16)
01.06.1995
నిన్నటి రాత్రి శ్రీసాయికి నమస్కరించి "గత జీవితములోని స్నేహితులతో ఏవిధముగా మసలుకోవాలి చెప్పు తండ్రి" అని వేడుకొన్నాను. రాత్రి కలలో శ్రీసాయి చూపిన దృశ్యాలు.
1) అది గోల్కొండ కోట. పాతబడిన భవనాలు. ఆభవనాల్లో నివసించిన నవాబుల చరిత్రను గైడు చెప్పసాగినాడు.
యాత్రికులు అందరు శ్రధ్ధగా వినసాగినారు. సాయంత్రము అయినది. ఆభవనాలలో దీపాలు పెట్టేవారు కూడా లేరు. యాత్రికులు బరువైన మనసుతో తమ యిండ్లకు వెళ్ళిపోయినారు.
2. అది పాత పాడుబడిన టేప్ రికార్డరు. అతి కష్ఠము మీద దాని టేప్ మీద కొత్త సినీమా పాటలు రికార్డు చేసినాను. వినాలని కుతూహలముతో ఆటేప్ రికార్డరును ఆన్ చేసినాను. టేప్ రికార్డరులోని మోటారు మెల్లిగా తిరగటము వలన కొత్త సినీమా పాట కూడా పాతకాలము పాటలాగ వినబడసాగినది. ఆపాట వినలేక ఆపాత టేప్ రెకార్డరును ఆఫ్ చేసినాను.
02.06.1995
నిన్నరాత్రి శ్రీసాయికి నమస్కరించి "సాయినాధ శిరిడీలోని నీసమాధి గురించి చెప్పమని వేడుకొన్నాను. శ్రీసాయి కలలో చూపిన దృశ్యము. అది శిరిడీ గ్రామము. ఆగ్రామములో ఒక స్త్రీ, మట్టిని ప్రోగుచేసి నమ్మకము అనే యిటికలను తయారు చేసి తన పిల్లలకు పంచసాగినది.
ఆవిధముగా యిటుకలను తయారు చేస్తూ వాటిని తన పిల్లలకు పంచుతూ ఆమట్టిలో సమాధి అయిపోయినది. యిపుడు ఆమె పిల్లలు అందరు శిరిడీకి వెళ్ళి ఆక్కడి మట్టితో నమ్మకము అనే యిటుకలను వారే తయారు చేసుకొని తమ జీవిత సౌధములను నిర్మించుకొంటున్నారు.
21.06.1995
నాలుగురోజుల క్రితము సాయంత్రము వేళలో నాలుగు పిల్లి పిల్లలు నాయింట చేరినవి.
అవి నన్ను చూసి సంతోషముతో నాకాళ్ళవద్ద గెంతులు వేయసాగినవి. సమయములో 18, 19, అధ్యాయము 162 పేజీలో శ్రీసాయి అన్నమాటలు. "ఏదైన సంబంధము యుండనిదే ఒకరు యింకొకరి దగ్గరకు పోరు. ఎవరు గాని ఎట్టి జంతువుగాని నీవద్దకు వచ్చిన నిర్దాక్షిణ్యముగా వానిని తరిమివేయకుము. వాటి ఆకలిని తీర్చిన మరియు వాని దాహమును తీర్చిన భగవంతుడు ప్రీతి చెందును." గుర్తుకు వచ్చినవి. వెంటనే వంట యింటిలోనికి వెళ్ళి ఒక గిన్నెలో పాలుతెచ్చి వాటికి పెట్టినాను. ఆనాలుగు పిల్లులు ఆపాలు త్రాగి వెళ్ళిపోయినవి. ఆనాటినుండి రోజు నేను ఆఫీసు నుండి తిరిగి వచ్చే సమయానికి ఆపిల్లులు నాయింట చేరి నాకాళ్ళ దగ్గర గెంతులు వేయసాగినవి.
నేను వాటికి పాలు పట్టడము ఒక అలవాటుగా మారినది. అందుచేత నిన్నరాత్రి నిద్రకు ముందు శ్రీసాయికి నమస్కరించి నాయింట చేరిన ఈనాలుగు పిల్లి పిల్లలకు నాకు గల సంబంధము తెలియచేయమని శ్రీసాయిని వేడుకొన్నాను. శ్రీసాయి రైల్వే మంత్రి శ్రీ జాఫర్ షరీఫ్ రూపములో దర్శనము యిచ్చి అన్నమాటలు. "గోపాలరావు నీవు 1918 సంవత్సరానికి ముందు జన్మించి యుంటే నాసేవ చేసుకొని యుండేవాడిని అని అనేక సార్లు నాపటము ముందు నిలబడి అన్నావు. 1974 సంవత్సరములో నీతండ్రి చనిపోయినారు. ఆయన 54 సంవత్సరాలకే చనిపోవటము వలన ఆయన సేవ చేసుకోలేదని అనేక సార్లు నీమనసులో బాధపడినావు. భౄణహత్య పాపము అని తెలిసి కూడ నీజీవితములో రెండుసార్లు నీభార్యకు గర్భస్రావము చేయించినావు. నిన్ను ఋణ విముక్తుని చేయటానికి నా ఆత్మ, నీతండ్రి ఆత్మ, గర్భస్రావములో చనిపోయిన నీయిద్దరి పిల్లల ఆత్మలు పిల్లిపిల్లల ఆత్మలలో ప్రవేశించి నీయింట కొన్నిరోజులు పాలు త్రాగుతాయి. నీవు ఋణవిముక్తుడివి కాగానే వాటి అంతట అవి నీయింటినుండి వెళ్ళిపోతాయి." కలలో ఈమాటలు విన్నతర్వాత నిద్రనుండి లేచి శ్రీసాయికి నమస్కరించినాను. మరి యింకా ఎన్నిరోజులు ఈపిల్లిపిల్లలు నాయింట పాలు త్రాగుతాయి వేచి చూడాలి.
(యింకా ఉంది)
సర్వం శ్రీసాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment