Sunday 5 February 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (21)


 
సాయి.బా.ని.. డైరీ - 1994  (21)

నిన్నటిరోజున కుటుంబ సభ్యుల అనారోగ్యము, కుటుంబ సభ్యులతో గొడవలతో జీవితముపై విరక్తి కలిగినది.  ఏమీ చేయలేని స్థితిలో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను.  శ్రీ సాయి కలలో ఒక అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి తెలియచేసిన సందేశము.


"జీవితములో కష్ఠాలు అనేవి  మన వస్త్రాలకు అంటుకొన్న మురికి.  ముకిరి అంటుకొన్నది అని వస్త్రాలను బయట పడవేయలేముగా.  అందుచేత భగవంతుని అనుగ్రహము అనే సబ్బును సంపాదించి దానితో మురికిని తొలగించుకొని తిరిగి తెల్లని స్వచ్చమైన వస్త్రాలను (ప్రశాంత జీవితాన్ని ) ధరించాలి."  నిద్రనుండి లేచిన తర్వాత శ్రీ సాయికి కృతజ్ఞతలు తెలిపినాను. 

22.07.1994

నిన్నటిరోజున శ్రీ సాయి గురించి ఆలోచించినాను.  తెల్లవారితే 22.07.94నాడు గురుపూర్ణిమ.  శ్రీ సాయికి గురుదక్షిణగా ఏమి యివ్వాలి అనే ఆలోచనలతో నిద్రపోయినాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి నాలోని బలహీనతలను తనకు గురు దక్షిణగా యివ్వమన్నారు.  ఆబలహీనతలు (1) బంధుప్రేమ (2) తల్లిమీద ప్రేమ (3) భార్యమీద ప్రేమ (4) పరస్త్రీ వ్యామోహము (5) ధన సంపాదనపై వ్యామోహము.  నిద్రనుండి మేల్కొని శ్రీ సాయి కోరిన గురుదక్షిణ యివ్వటానికి నిశ్చయించుకొన్నాను.    

23.07.1994

నిన్నటిరోజు గురుపూర్ణిమ.  శ్రీ సాయి గుడికి వెళ్ళలేదు.  సత్ సంగములో పాల్గొనలేదు.  నా మనవడుని ఆసుపత్రినుండి యింటికి తీసుకొని వస్తూ ఉంటే నా స్కూటర్ ఒక ముసలివానిని గుద్దినది.  నేను నా కుటుంబ సభ్యుల గురించి ఆలోచించుతూ స్కూటర్ మీద ప్రయాణము సాగించుతుంటే ప్రమాదము జరిగినది.  ముసలివానిని (అతను తెల్లని వస్త్రాలు ధరించి, తెల్లని జుట్టు, తెల్లని గెడ్డముతో యున్నాడు).  ఆసుపత్రిలో చేర్పించి అతని చేతికి తగిలిన గాయాలకు కట్లు కట్టించి  మందులు యిప్పించి అతని యింటికి పంపినాను.  ఆసుపత్రిలో అయిన ఖర్చు 300/- రూపాయలు.  చికాకుతో యింటికి చేరినాను.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి గురుపూర్ణిమ సరిగా జరపలేక పోయినందులకు క్షమించమని వేడుకొన్నాను.  శ్రీ సాయి కలలో చూపిన దృశ్యము "నేను ఒక లాబరేటరీ (పరిశోధన ఆలయము) కి వెళ్ళి నాలోని గుణగణాలను పరీక్షించమని కోరుతాను.    లాబరేటరీలోని అధికారి నా చేత 300/- రూపాయలు కట్టించుకొని నాపై అనేక పరీక్షలు  చేసి సర్టిఫికెట్ యిచ్చినారు."  నాకు నిద్రనుండి మెలుకువ వచ్చి ఆలోచించసాగినాను.  శ్రీ సాయి 22.07.94 నాడు (గురుపూర్ణిమ) యిచ్చిన సందేశము ప్రకారము నాలోని ఐదు బలహీనతలను వదలించుకోవాలి.  నేను వాటిని వదలలేకపోవటముతో నేను స్కూటర్ ను అజాగ్రత్తగా నడిపి ఒక ముసలివానిని (శ్రీ సాయిని) గాయ పరచినాను.  ఆముసలివాని గాయాలకు కట్టుకట్టించటానికి  మందుల నిమిత్తము ఖర్చుపెట్టినది 300/- రూపాయలు.  మరి రాత్రి కలలో నాలోని గుణగణాలను పరీక్షించటానికి లాబరేటరీ అధికారి (శ్రీ సాయికి) కట్టిన సొమ్ము 300/- రూపాయలు.  శ్రీ సాయి నాచేత 300/- రూపాయలు ఖర్చుపెట్టించి బంధుప్రేమను తొలగించుకోమని సందేశము యిచ్చినారు.   

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు 


No comments:

Post a Comment