Monday 2 January 2012

బాబాతో సాయి.బా.ని.స. అనుభవాలు - 12


బాబాతో సాయి.బా.ని.. అనుభవాలు - 12



శ్రీ సాయి సచ్చరిత్ర 38 అధ్యాయంలో అన్నదానము గురించి ప్రముఖంగా చెప్పబడింది. శ్రీ సాయి ఆకలి గొన్నవారికి తనే స్వయంగా వండి వడ్డించేవారు. భోజనం వేళకు యెవరు ఏరూపంలో వచ్చినా సరే వారికి ఆతిధ్యమిమ్మని సాయి నొక్కి వక్కాణించేవారు. సామూహిక భోజనాలప్పుడు, వివాహాలూ, పూజలు సమయాలలో బాబాని భోజనానికి ఆరోజుల్లోఆయన భక్తులు ఆహ్వానించేవా రు

శ్రీ సాయి సచ్చరిత్ర 40 అధ్యాయంలో శ్రీ బీ.వీ.దేవ్ తన యింట జరుగుతున్న ఉద్యాపన కార్యక్రమానికి అన్న సంతర్పణ కార్యక్రమానికి సాయిని ఆహ్వానించగా శ్రీ సాయి ఒక సన్యాసి యిద్దరు శిష్యులతో వచ్చి భోజనము చేసి వెళ్ళిన సంఘటన మనకందరకు తెలిసినదే. అటువంటి సంఘటన నా జీవితంలో జరిగినదని సవినయంగా మీకందరకూ తెలియచేస్తున్నాను.

అది 1991 సంవత్సరము. నా యింటి నిర్మాణము పూర్తి అయిన సందర్భములో విజయదశమి పర్వదినాన నా గృహనిర్మాణములో పనిచేసిన పనివారలను ఆరోజు భోజనానికి ఆహ్వానించాను. ఆరోజు జరిగే భోజనకార్యక్రమములో శ్రీ సాయిని కూడా వచ్చి భోజనము చేయమని వేడుకున్నాను. నేను 15 మందిని ఆహ్వానించినాను. 15 మందిలో కనీసం 10 మంది భోజనానికి వస్తారు 10 మందిలో సాయి కూడా ఉంటారు, తరువాత 10 మంది భోజనం చేసిన తరువాతనే నేను భోజనము చేస్తానని సంకల్పిచుకున్నాను. బాబాకు మధ్యాహ్న్న ఆరతి పూర్తి అయిన తరువాత వచ్చిన పనివారందరికీ భోజనాలు వడ్డించినాము. భోజన పంక్తిలో 9 మందే భోజనము చేయసాగారు. 9 మంది భోజనాలు పూర్తి చేసుకుని సంతోషముగా వారు తమ యిండ్లకు వెళ్ళిపోయినారు. కనీసము 10 మంది భోజనానికి వస్తారని ఆలోచనలో ఉండి పదవ మనిషి గురించి యెదురు చూడ సాగాను. నా భార్య తానిక ఆకలికి తట్టుకోలేనని తన భోజనము పూర్తి చేసినది. బాబా యింకా భోజనానికి రాలేదు. బాబాని పదవ మనిషిగా భోజనానికి వస్తారని ఆయన రాకకోసం యెదురు చూడసాగాను. మధ్యాహ్న్నము మూడు గంటలయినది. నాలోని సహనానికి ఒక పరీక్షగా మారింది. నా భార్య నన్ను చూసి చిరాకు పడసాగినది. బాబా రోజు నా యింటికి భోజనానికి రారా అనే బాధలో సాయంత్రము నాలుగు గంటల వేళ నా భార్య వచ్చి నన్ను భోజనము చేయమని శాసించినది. సమయములో బాబా మీద నమ్మకంతో బాబానుండి ఒక సందేశము కోరదలచి అంతకు ముందురోజున పుస్తకాలషాపులో కొన్న కొత్త పుస్తకము,"సాయిబాబా ఆఫ్ షిరిడీ యూనిక్ సైంట్" నాకళ్ళ ముందు కనిపించింది. బాబా శరీరంతో నా యింటికి రాకపోయినా కనీసము పుస్తకము ద్వారా ఏదయినా సందేశము ఇవ్వగలరా అనే ఆలోచనతో కొత్తపుస్తకముపై ఉన్న ప్లాస్టిక్ కవరును తొలగించి బాబాను ప్రార్థించి కళ్ళు మూసుకుని ఒక పేజీ తెరిచినాను. అది 134, 135 పేజీలు వచ్చినవి 134 పేజీలో నాకేమీ సందేశము దొరకలేదు. 135 పేజీ ఆఖరి పేరాలో బాబా శరీరంతో ద్వారకామాయిలో ఉన్నరోజులలో అన్న మాటలు "నన్నింకా తినమని అడుగుతున్నావా, నా భోజనము పూర్తి అయినది. నీవు నీయింటికి వెళ్ళి భోజనము చేయి" అనే మాటలు చదివి శ్రీ సాయి నా యింట వచ్చి భోజనము చేసినారు అనే భావనతో బాబాకు నైవేద్యముగా పెట్టిన పళ్ళెము వైపు చూసినాను. నా కళ్ళను నేను నమ్మలేకపోయినాను. ఒక గండు చీమ బాబాకు నైవేద్యముగా పెట్టిన మిఠాయిని తినడము మిఠాయి చుట్టూ ప్రదక్షిణలు చేయడము నన్ను ఆశ్చర్యపరచినది. శ్రీ సాయి సచ్చరిత్రలో సాయి 9 అధ్యాయములో అన్న మాటలు "నీ భోజనమునకు పూర్వము కుక్కను చూచి నీవు రొట్టె పెట్టితివో అదియు నేను ఒకటే. అట్లాగే పిల్లులు, పందులు, ఈగలు, చీమలు, ఆవులు, మొదలుగా అన్నియు నా అంశములే. నేనే వాని ఆకారములో తిరుగుతున్నాను. ఎవడయితే జీవ కోటిలో నన్ను చూడగలుగుదురో వారే నాప్రియ భక్తులు."

బాబా నేను కోరుకున్న పదవ మనిషి చీమ రూపములో వచ్చి భోజనము చేసినారు అని భావించి నాలుగంటల ముప్పయి నిమిషాలకు నేను భోజనము చేసి భోజనానంతరము బాబాకు సాష్టాంగ నమస్కారము చేసి, నా భార్యతో నా సంతోషాన్ని పంచుకున్నాను.


No comments:

Post a Comment