Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1993 21 వ. భాగము

సాయి.బా.ని.స. డైరీ - 1993 21 వ. భాగము సాయి.బా.ని.స. డైరీ - 1993 14.11.1993 నిన్నటిరోజు రాత్రి దీపావళి పండుగ - నేను ఘనముగా పండగ జరపలేకపోయినాను. శ్రీ సాయి ఆరోజులలో షిరిడిలో నూనె వర్తకులు నూనె యివ్వకపోయినా ద్వారకామాయిలో నీళ్ళతో దీపాలు వెలిగించి శిరిడీ ప్రజలను ఆశ్చర్య పరచినారు. నా జీవితములో అటువంటి లీలను చూడాలనే కోరికను శ్రీ సాయికి వెలుబుచ్చి నిద్రపోయినాను. కలలో నేను పొందిన అనుభూతి - "నా యింటిలో నేను రాత్రివేళ శ్రీ సాయి సత్ చరిత్రను చదువుతూ నిద్రపోయినాను. తెల్లవారినది. నా తల్లి వచ్చి ఏదుస్తు నిన్న రాత్రి నీ తండ్రి చనిపోయినారు అని చెప్పినది. నేను నా తండ్రికి ఆఖరి క్షణములో నోటిలో తులసి నీరు పోయలేదు అనే బాధతో నా తండ్రి శరీరముపై చేతులు ఉంచి ఏద్వసాగినాను. నా తల్లి ధైర్యముగా ఉండి తదుపరి కార్యక్రమాలు చేయమని చెప్పి వెళ్ళిపోయినది. నా మనసులో నా తండ్రి నోటిలో తులసి నీరు పోయలేదనే బాధ శ్రీ సాయికి విన్నవించుకొన్నాను. శ్రీ సాయి ప్రత్యక్షమై నా తండ్రికి ప్రాణము యిచ్చి నా చేత నా తండ్రి నోటిలో తులసి జలము రెండు చెంచాలు పోయించినారు. నా తండ్రి సంతోషముతో నన్ను ఆశీర్వదించినారు. శ్రీ సాయి యింకొక చెంచా తులసి నీరు నా తండ్రి నోటిలో పోయమన్నారు. నేను మూడవ చెంచా తులసి నీరు పోసినాను. ఆ తులసినీరు న తండ్రి నోటినుండి బయటకు వచ్చివేసినది. నా తండ్రి ప్రాణము సునాయాసముగా పోయినది. శ్రీ సాయికి కృతజ్ఞతలు తెలిపినాను. యింతలో నా తల్లి వచ్చినది. నేను నా తండ్రి నోటిలో ఆఖరి శ్వాస తీసుకొనే సమయములో తులసి నీరు పోసినాను అని చెప్పినాను ఆమె నమ్మలేదు. బంధువులు అందరు వచ్చి నా తండ్రి శరీరాన్ని పాడెమీద కట్టినారు. నాకు నిద్రనుండి మెలుకువ వచ్చినది. P,S. నిజ జీవితములో శ్రీ రావాడ వెంకటరావు నా తండ్రి 30.07.1974 నాడు కేరళలోని యిడక్కి గ్రామములో మరణించినారు. ఆయన మరణ సమయములో ఆయన పిల్లలు ఎవరు ఆయన దగ్గరలేరు. నా తల్లి మాత్రము ప్రక్కన యున్నది. నేను, నా తమ్ముడు 31.07.1974 నాడు యిడిక్కి చేరుకొని ఆయన శరీరానికి యిడిక్కి గ్రామములో దహన సంస్కారాలు చేసినాము. నా తండ్రి ఆఖరి శ్వాస తీసుకొనే సమయములో నేను పెద్దకుమారునిగా ఆయన నోటిలో తులసి జలము పోయలేదు అనే బాధను, 13.11.1993 రాత్రి కలలో తొలగించినారు. నీజీవితములో తీరని కోరికలను స్వప్నము ద్వారా తీర్చుతారు శ్రీ సాయి. 17.11.1993 నిన్న రాత్రి శ్రీ సాయికి నమస్కరించి నిజ జీవితములో ముఖ్యముగా గుర్తు ఉంచుకోవలసిన విషయాలు చెప్పమని కోరుకొన్నాను. శ్రీ సాయి నన్ను 1991 - 92 సంవత్సరాలలో వెనక్కి తీసుకొని వెళ్ళి నా కుమార్తె వివాహము విషయములో నేను చేసిన పొరపాట్లు చూపించినారు. శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో అన్నారు "గొప్పవాళ్ళతో స్నేహము కోరడములో తప్పు లేదు - ఆ స్నేహాన్ని బంధుత్వముగా మార్చుకోవటానికి ప్రయత్నించితేనే ముప్పు". 19.11.1993 నిన్నటి రోజు గురువారము. శ్రీ సాయికి గురువారము అంటే యెందుకు అంత యిష్ఠము అనే ఆలోచనలతో గురువారము ప్రాముఖ్యత చెప్పమని శ్రీ సాయిని వేడుకొని నిద్రపోయినాను. శ్రీ సాయి కలలో చూపించిన దృశ్యము. అవి మొదటి ప్రపంచ యుధ్ధము జరుగుతున్న రోజులు. భారతీయ సైనికులు విదేశాలలో యుధ్ధము చేస్తున్నారు. భారతీయ సైనికులు ఒక జట్టుగా ముందుకు వెళ్ళుతున్నారు. ఆ జట్టుకు నాయకుడు శ్రీ సాయి భక్తుడు. ముందు నాయకుడు అతని వెనుక అతని సహచరులు ఉన్నారు. శతృవులు ఆ జట్టునాయకుని చూసినారు. శతృవులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. భారతీయ సైనికులు తక్కువ మంది యున్నారు. శతృవులు భారతీయ సైనికుల జట్టు నాయకునిపై కాల్పులు సాగించినారు. భారతీయ జట్టు నాయకుడు తన సహచరులను ఎదురు కాల్పులు సాగించవద్దు అని చెప్పి తాను ఒక్కడే ముందుకు వెళ్ళి శ్రీ సాయి నామము ఉచ్చరించుతు శతృవులతో యుధ్ధము చేస్తు తన సహచరులను రక్షించుకొనేందుకు తన ప్రాణాలును బలిదానము చేసినాడు. విదేశాలలో తన నామము ఉచ్చరించుతు ప్రాణలు విడిచిన భారతీయ జట్టు నాయకుని ఆత్మ శ్రీ సాయినాధునిలో విలీనమైన రోజు గురువారము. అందుకే శ్రీ సాయికి గురువారము అంత ప్రాముఖ్యమైనది. (ఇంకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment