Wednesday 25 January 2012

సాయి.బా.ని.స. డైరీ - 1994 (13)



సాయి.బా.ని.. డైరీ -  1994  (13)

12.04.1994

నిన్నటిరోజున కుటుంబ సభ్యులు నాకు చాలా చికాకు కలిగించినారు.  రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నా మనసుకు ప్రశాంతత కలిగించమని వేడుకొన్నాను. 



  శ్రీ సాయి కలలో చూపించిన దృశ్యముయొక్క సందేశము, "జీవితము ఒక అంతులేని నడక - దారిలో యితరులను కలుస్థాము వారితో బాల్ బాడ్ మెంటన్ ఆట ఆడుతాము ఒకళ్ళు గెలుస్థారు - యింకొకరు ఓడిపోతారు.  ఓడిపోయినవాడు బాధ పడటములోను, గెలిచినవాడు సంతోష పడటములోను అర్థము లేదు.  అదే విధముగా మానావమానాలు ఆలోచించటములో అర్థము లేదు."



13.04.1994

నిన్నటిరోజున సంసార బాధ్యతలపై ఆలొచించుతూ పిల్లలను పెంచి పెద్ద చేయటములో నా  భాధ్యత ఎంతవరకు ఉన్నది తెలియచేయమని శ్రీ సాయినాధుని వేడుకొన్నాను.  శ్రీ సాయి రాత్రి కలలో దృశ్యరూపములో చూపించిన విషయాల సారాంశము - 1) ఆడపిల్లకు వివాహము జరిపేవరకు బాధ్యత వహించాలి ఆకన్న తండ్రిదాని తర్వాత పిల్ల బాధ్యతలను ఆమె భర్త వహించుతాడు.  2) మగపిల్లవాని విషయములో కన్న తండ్రి. - "పిల్లవాని విద్యాబుధ్ధులు పూర్తి అయి పిల్లవాడు తన కాళ్ళపై నిలబడి స్వంత్రముగా జీవించగలగటము నేర్చుకొనే వరకు పిల్లవాని బాధ్యతను వహించాలి." విధముగ కన్న పిల్లల ఋణము తీర్చుకోవాలి.     

16.04.1994

నిన్నటిరోజున హైదరాబాదులోని నా మితృని యింటికి వచ్చిన స్వామీజీకి పాద పూజ - స్వామీజీకి సత్కారము సన్మానము వగైరా ఆడంబరాలు చూసిన తర్వాత సన్యాస ఆశ్రమముపై మోజు కలిగినది.  ఆలోచనలతో నిద్రపోయినాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము యిచ్చి అన్న మాటలు నాకు కనువిప్పు కలిగించినవి.  వాటి వివరాలు. "కన్న తల్లిని - జన్మించిన గ్రామాన్ని - ఉద్యోగముచేసిన స్థలముపై మమకారము విడిచిపెట్టడము గొప్ప గొప్ప సన్యాసులకే కష్ఠము - అందుచేత సన్యాస ఆశ్రమము సన్యాసుల సాంగత్యము కోరకుండ చక్కగా గృహస్థ ఆశ్రమము నిర్వర్తించుతు పని పాటలు చేసుకొంటు పరమ శివుని పూజించటము  ఉత్తమము."

22.04.1994

నిన్నటి రోజున గృహస్థ ఆశ్రమములో కుటుంబ సభ్యుల బాధ్యతలను నిర్వర్తించటములోనే   జీవితము గడచిపోతున్నదే అనే బాధ కలిగినది.  యింక భగవంతుని సేవ ఎప్పుడు చేసుకోవాలి దయచేసి తెలియ చేయమని శ్రీ సాయినాధుని వేడుకొన్నాను.  శ్రీ సాయి అజ్ఞాత వ్యక్తి రూపములో యిచ్చిన సందేశము నాలో భగవంతుని సేవ చేసుకోవటానికి ఆశ కలిగించినది.  అజ్ఞాత వ్యక్తి అన్న మాటలు .  నీవు పొడి శనగలను పాత బట్టలో కట్టిన, కొత్త బట్టలో కట్టిన వాటిపైన  నీరు చల్లితేనే కదా మొలకలు వస్తాయి.  అదే విధముగా నీ మనసులోని పొడి శనగలపై భక్తి భావము అనే నీరు చల్లితేనే భగవంతుని అనుగ్రహము అనే మొలకలు వస్తాయి.  నీ మనసులో భక్తిభావము కలగటమే భగవంతునికి నీవు చేయగలగిన సేవ.  అంతే గాని పూజలు పునస్కారాలు మాత్రము కాదు. 
 
శ్రీ సాయి చూపిన మరొక దృశ్యము.  నా స్నేహితుడు కాషాయ వస్త్రాలుతో ఒక చేతిలో కమండలము, మరచెంబు ధరించి నా దగ్గరకు వచ్చి తను పెండ్లి కూతురిని చూడటానికి   వెళ్ళుతున్నానని తన పెండ్లికి రమ్మనమని ఆహ్వానించుతాడు.  శుభ సందర్భములో తనతో బాటు బీరు త్రాగమని మరచెంబు మూత తీస్తాడు.  నేను బీరు త్రాగనని చెబుతాను.  ఆయన  వేషధారణ నాలో నవ్వు పుట్టించినది.  నిద్రనుండి మేల్కొని ఆలోచించినాను.  శ్రీ సాయి నాలోని మానసిక బాధను గ్రహించి హాస్య రూపములో చక్కటి సందేశము ప్రసాదించినారు - నేను గ్రహించగలిగిన సందేశము కొంత మంది ఏళ్ళు మీరినవారు జ్ఞానిలాగ వేషధారణ చేయగలరే కాని అజ్ఞానముతో ప్రాపంచిక విషయాలలో మునిగి తేలుతు పదిమందిలో నవ్వులపాలు అగుతారు.  అటువంటివారి ప్రవర్తనకు నీవు బాధ పడనవసరము లేదు.  అటువంటి వారినుండి దూరముగా ఉండు."   

 (యింకా ఉంది)

సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు



No comments:

Post a Comment