Wednesday 4 January 2012

సాయి.బా.ని.స. డైరీ 1992

సాయి.బా.ని.స. డైరీ 5వ భాగము 13.09.1992 నిన్న రాత్రి టీ.వీ. లో డాడి సినిమా చూసిన తర్వాత మత్తు మందు త్రాగుడు విషయములో అనేక ఆలోచనలు మనసులో మెదలసాగినవి. నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి నాకు ఉన్న ఈ దురలవాటును మాన్పించమని వేడుకొన్నాను. శ్రీ సాయి కలలో రెండు దృశ్యాలు చూపించినారు. 1) నా దగ్గర బంధువు (నా మేనమామ) త్రాగుడుకు బానిస అయి సంసారము నాశనము చేసుకొన్నాడు. అతని కుమారుడు తండ్రిని త్రాగవద్దని అతి దీనముగా వేడుకొంటూ ఉంటాడు. 2) నా స్నేహితుడు ఒకడు నా ఇంటికి వచ్చి నా తోటలో ఎగురుతున్న పావురాన్ని వండుకొని తినటానికి రాతితో కొడతాడు. నేను ఆ పావురాన్ని దగ్గరకు తీసి దాని రెక్కకు మందుపూసి దానిని గాలిలో ఎగరవేసినాను. ఆ పావురము సంతోషముతో ఎగిరిపోయినది. ఈ రెండు దృశ్యాలతో నాలో ఏదో తెలియని బాధ కలిగినది. త్రాగుడు వలన సంసారము నాశనము అగుతుంది. మాంసాహారము తినటము వలన జీవహింస జరుగుతుంది. ఆ ఉద్దేశముతో శ్రీ సాయిని ఈ రెండు దురలవాట్లను నా నుండి దూరము చేయమని కోరినాను. శ్రీ సాయి నా చేతికి ఒక గడ కఱ్ఱ ఇచ్చి దొమ్మరవాడులాగ ఏకాగ్రతతో త్రాడు మీద నడవమన్నారు. నేను తాడు మీద నడక ప్రారంభించినాను. శ్రీ సాయి పెద్ద సాలెపురుగు రూపములో వచ్చి త్రాడుకింద ఓ పెద్ద వలను అల్లుతున్నారు నాకు ధైర్యము చెప్పటానికి. శ్రీ సాయి ఇచ్చిన వల ఉంది అనే ధైర్యముతో "నమ్మకము" అనే గడ షాయముతో త్రాగుడు, మాం సాహారము తినటము అనే దురలవాట్లకు దూరముగా ఏకాగ్రతతో సాయి మార్గము అనే త్రాటి మీద నడుస్తూ జీవితములో ముందుకు వెళుతున్న అనుభూతిని పొందినాను. శ్రీ సాయి సత్ చరిత్ర 18,19 అధ్యాయములలో ఒక త్రాగుబోతుకు స్వప్నములో కనిపించి, చాతీ మీద కూర్చుని ఛాతీని నొక్కి వేసి ఎన్నడు త్రాగనని వాగ్దానము చేసిన పిమ్మట వదలెను. అనే విషయము మరియు 38 వ. అధ్యాయములో నిజమైన ఏ యోగిగాని, గురువు గాని తన శిష్యునకు నిషేధా హారమును తిని చెడిపొమ్మని చెప్పడు అనే విషయము అక్షరాల నిజము అని నమ్ముతాను. 17.09.1992 గురువారము నిన్న రాత్రి జీవితములో డబ్బు సంపాదన గురించి ఆలోచించినాను. ఆలోచనలతో మనసు పరి పరి విధాలుగా చికాకు పడినది. శ్రీ సాయి ఓ అజ్ఞాత వ్యక్తి రూపములో దర్శనము ఇచ్చి అంటారు.."నీ దగ్గర డబ్బుతో రెండు గదులుకు పునాది వేయి. అందులో శ్రీ సాయిని ఉండనీయి. నీ చికాకులు అన్నీ దూరము అగుతాయి." శ్రీ సాయి అనుగ్రహించిననాడు ఒక లక్ష రూపాయలు నిలువ చేసి రెండు గదులు నిర్మించి శ్రీ సాయితోపాటు నేను అందులో నివసించుతూ ప్రశాంత జీవితము గడపాలి. శ్రీ సాయి ఈ విధముగా సూచించటము శ్రీ సాయి సత్ చరిత్రలో 29 వ. అధ్యాయములో శ్రీ మాన్ గోపాల్ ముకుంద్ బూటీకి స్వంత భవనములో మందిరము నిర్మించమని యిచ్చిన ఆదేశమును గుర్తు చేస్తున్నది. మరి శ్రీ సాయి నాచేత రెండు గదులకు పునాది వేయమనటము అంటే చావడి నిర్మించమని ఆదేశమా? కాలమే నిర్ణయించుతుంది. శ్రీ సాయి స్వయముగా సమయము, సందర్భము వచ్చినపుడు నా చేత రెండు గదులు నిర్మించుతారు అని నేను నమ్ముతాను. 23.09.1992 బుధవారము నిన్న రాత్రి ఆఫీసు గొడవలు, సంసారములో వియ్యాలవారితో చికాకులను తొలగించమని శ్రీ సాయికి నమస్కరించి నిద్ర పోయినాను. శ్రీ సాయి ఆఫీసు గొడవలకు పరిష్కారమును విచిత్రముగా చూపించినారు. ఆఫీసులో నాతో రోజు దెబ్బలాడే నా క్రింద అధికారిని మధ్యవర్తిగా పెట్టి నాచేత బంగారు దుకాణములో బంగారము కొనిపించుతారు. ఈ దృశ్యము ద్వారా శ్రీ సాయి నా శతృవును నా మితృడిగా మార్చుతారు అనే భావన కలిగించినారు. వేచి చూడాలి. యిక వియ్యాలవారితో చికాకులను శ్రీ సాయి చక్కని దృశ్యము ద్వారా తొలగించినారు. నేను పుట్టిన గ్రామము (బోడసకుఱ్ఱు) లో ఒక మితృడు యింట వివాహము జరుగుతున్నది. ఆ వివాహమునకు ఖర్చు బాగా జరిగినది అని పెండ్లికి వచ్చిన బంధువులు మాట్లాడుతున్నారు. ఆ పెండ్లి అయిన వెంటనే పెద్ద వాన వరద వచ్చినది. పెండ్లికి వచ్చినవారు ఇబ్బందులలో చిక్కుకొనిపడిపోయినారు. అంత వాన వరదలోను ఓ అజ్ఞాత వ్యక్తి మూడు పడవలు తెచ్చి యింటిముందు కట్టియుంచి మీకు భయము లేదు. మీరు అందరు ఈ మూడు పడవలు ఎక్కండి. మిమ్ములను సురక్షితముగా మీ గమ్యాలకు చేర్చుతాను అంటారు. శ్రీ సాయి ఈ విధముగా నా వియ్యాలవారితో చికాకులు తొలగించటానికి భూత - భవిష్యత్ - వర్తమానము అనే మూడు పడవలు తెచ్చినారని నమ్ముతాను. శ్రీ సాయి సత్ చరిత్ర 51 వ. అధ్యాయములో ఈ సంసారము అనే మహా సముద్రము దాటుట మహా కష్ఠము. --- ఈ మహాసముద్రమును దాటుటకు మన సద్గురువు నావ వంటివారు. వారు మనలను సురక్షితముగా దాటించెదరు. యిది ముమ్మాటికి నిజము అని నమ్ముతాను. 24.09.1992 గురువారము నిన్న రాత్రి నిద్రకు ముందు శ్రీ సాయికి నమస్కరించి భవిష్యత్ లో నేను చేయవలసిన పనులు చెప్పమని వేడుకొన్నాను. శ్రీ సాయి చూపిన దృశ్యము - నేను తెల్లవారు జామున మొదటి షిఫ్ట్కు ఆఫీసుకు వెళ్ళటానికి బస్సు గురించి రోడ్డు మీద నిలబడినాను. ఒక పాత బస్సు రోడ్డుమీదకు రాగానే అది నా ఆఫీసు బస్సు అని భ్రమించి దానిని ఆపి ఎక్కినాను. అందులో ఆడవాళ్ళు, పిల్లలు, నా మితృడు వేణుగోపాల్ ఉన్నారు. ఆ బస్సు నా ఆఫీసుకు వెళ్ళకుండ ఎటో యింకొక మార్గములో వెళుతున్నది. నేను బస్సు డ్రైవరుని బస్సు ఎక్కడికి వెళుతున్నది అని అడుగుతాను. అతను సమాధానము చెప్పడు. కనీసము వెనక్కి త్రిప్పమని అడుగుతాను. తాను వెనక్కి తిప్పను అని చెప్పి నన్ను బస్సు దిగమంటాడు. నాకు ఏమిచేయాలి తోచక బస్సు దిగిపోయినాను. అపుడు తెల్లవారుతున్నది. వెలుతురు వస్తున్నది. దూరముగా కాషాయ రంగురాళ్ళతో కట్టిన భవనాలు కనిపించినాయి. నా ముందు మూడు శవాలు యాత్రలు జరిగినవి. మనసులో చాల ఆందోళన కలిగినది. ఆ భవనాలలోకెల్ల ఓ పెద్ద భవనము నుండి గంటమ్రోత వినిపించుతుంది. అది ఒక బడి అని గ్రహించినాను. ఆ బడి భగవంతునిది అని అక్కడివాళ్ళు చెప్పినారు. నేను ఆ బడిలోనికి వెళ్ళినాను. ఆక్కడి విద్యార్థులు అందరు నావయసు వాళ్ళు. కాని ఒకవ్యక్తి సుమారు 60 సంవత్స్రాలు ఉందవచ్చును. మంచి వర్చస్సుకలిగి తెల్లని వస్త్రాలు ధరించి యున్నారు. ఆయన నన్ను ప్రేమతో పిలిచి, భోజనము పెట్టి విశ్రాంతి కలుగచేసారు. బహుశ ఆయన సాయినాధుడు అయి ఉంటారని నా నమ్మకము. శ్రీ సాయి సఛ్ఛరిత్ర 32 వ. అధ్యాయములోని మాటలు " తల్లి పక్షి పిల్ల పక్షులను జాగ్రత్తగా చూచునట్లు నన్ను వారు కాపాడిరి. తమ బడిలో చేర్చుకొనిరి." నమ్ముతాను. 25.09.1992 శుక్రవారము నిన్న రాత్రి ప్రశాంతము అయిన మనసుతో శ్రీ సాయికి నమస్కరించి నిద్రపోయినాను. శ్రీ సాయి విచిత్రమైన దృశ్యము చూపించి నా జీవితానికి ఒక హెచ్చరిక యిచ్చినారు. * నేను రైలులో ప్రయాణము చేస్తూ ఒక స్టేషన్లో దిగి దాహము తీర్చుకోవటానికి ఒక కూల్ డ్రింక్ షాపు దగ్గరకు వెళ్ళినాను ఆ షాపులో ఓ స్త్రీ తన అందచందాలను ప్రదర్శ్మించుతూ ఎక్కువ డబ్బు వసూలు చేస్తూ నకిలి కూల్ డ్రింక్ అమ్ముతున్నది. నాకు నకిలి కూల్ డ్రింక్ వద్దు మంచి కూల్ డ్రింక్ యివ్వమని కోరినాను. కాని ఆమె చాల అహంకారముతో నాకు ఇవ్వబోయిన కూల్ డ్రింక్ ని తిరిగి తీసుకొని దానికి పాత మూత బిగించి ఫ్రిజ్ లో పెట్టివేసి నన్ను బయటకు గెంటించి వేస్తుంది. నేను దాహము బాధ తట్టుకోలేక కొంచము దూరము నడచి యింకొక దుకాణమునకు చేరుకొంటాను ఆ దుకాణము యజమాని చల్లటి మజ్జిగ నాకు ఇచ్చినారు. నా దాహము తీరినది. ఈ దృశ్యము చూచిన తర్వాత శ్రీ సాయి సత్ చరిత్ర 14 వ. అధ్యాయములో శ్రీ సాయి చెప్పిన మాటలు "మన పారమార్థికమునకు ఆటంకములు రెండు గలవు. ;మొదటిది స్త్రీ - రెండవది ధనము" అని మరల "మన పారమార్థికము ప్రగతికి భగవంతును అనుగ్రహము అనే మజ్జిగ (38 వ. అధ్యాయము) త్రాగటము అవసరము" అని నమ్ముతాను. (* యిక్కడ రైలు ప్రయాణమును జీవితముగాను, - దాహమును తీర్చుకోవటము అంటే ఆధ్యాత్మిక రంగములో ముందడుగు వేయటముగాను భావించాలి.) (ఇంకా ఉంది) సర్వం శ్రీ సాయినాధార్పణమస్తు

No comments:

Post a Comment